Thursday, July 25, 2019

జింక పిల్ల కాదు అడవి పులి | An uncovered story of Hima Das #Himadaas



12 వ తేది గురువారం జులై 2018
అది ఫిన్ లాండ్ లోని టంపెరె (Tampere) నగరం.
ప్రపంచ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో 400మీటర్ల అథ్లెటిక్స్‌ ఫైనల్ జరగడానికి అంతా సిద్ధంగా ఉంది.
భారతదేశం తరపున ప్రపంచ అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన అమ్మయిలు ఇప్పటిదాకా ఎవరూ లేరు. ఇంత పెద్ద దేశం, నూటా ముప్పై కోట్లకు పైగా జనాభా ఉన్న దేశం... ఇన్ని కోట్లమందిలో ఇంతవరకు ఒక్కరూ కుడా గోల్డ్ మెడల్ సాధించలేకపోయారు.
యధావిదిగానే మొక్కబడిగా భారతదేశం తరపున ఒక 18 ఏళ్ల అమ్మాయి బరిలో దిగింది. 
౩....2.....1..... ట్రిగ్గర్ పేలింది ....రేస్ స్టార్ట్ అయింది.
అనేక దేశాల నుంచి వచ్చిన అథ్లెట్స్ అందరూ వారి వారి శక్తిని కూడగట్టుకొని పరుగుతీయడం స్టార్ట్ చేసారు....
భారత్ తరపున 4వనెంబరు లైనులో పరుగుపెట్టిన అమ్మాయి ఎప్పటిలాగే రేసులో వెనకపడింది. కానీ ఈ కొత్తమ్మాయిపై కొన్ని ఆశలు ఉన్నాయి.
మొదటి 50 -100 మీటర్ల పరుగులో వెనుక ఉన్న ఆ అమ్మాయి, ఒక్కసారిగా మొదటి స్తానంలో ఉన్న రుమేనియా అథ్లెట్ ఆండ్రియా ను అనూహ్యంగా వెనక్కు నెట్టి ముందుకు పరుగెడుతోంది. గేం చూస్తున్న అందరూ షాక్... ఎవరీ జింక పిల్ల అని గ్యాలరీలో ప్రేక్షకులు గుసగుసలాడుకుంటున్నారు.
చివరి నిమిషం ... అంతా ఉత్కంట.... ఆట పూర్తి అయింది.
కట్ చేస్తే..., 400మీటర్ల ఫైనల్లో 51.46 నిమిషాల్లో గమ్యం చేరి తొలిస్థానంతో బంగారు పతకం అందుకుంది ఆ అమ్మాయి.
వామ్మో ఈ అమ్మాయి జింక పిల్ల కాదు, చిరుత పులి అని అందరూ చప్పట్లు కొట్టారు.
ధింగ్ ఎక్ష్ప్రెస్స్ అని పిలుచుకునే ఈ గోల్డెన్ లేడీ పేరు ‘హిమాదాస్’.
భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన హిమాదాస్ ... ఇంటర్నేషనల్‌ ట్రాక్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత స్ర్పింటర్‌గా రికార్డు నెలకొల్పింది.
ఆమె మెడల్‌ను అందుకున్న సమయంలో భావోద్వేగానికి లోనైంది.
మెడల్ సెర్మనీ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో హిమదాస్ రాల్చిన ఆనందభాష్పాల వీడియో షోషల్ మీడియా అంతా వైరల్ అయింది..
జ‌న‌గ‌ణ‌మ‌న‌ వల్లిస్తూనే ఆమె కన్నీరును ఆపుకోలేకపోయింది.
మహాంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహాంద్రా ఆ వీడియోను తన ట్విట్టర్‌ కాతాలో లో పోస్ట్ చేసారు.
ఇది మిమ్మల్ని కదిలించకపోతే, ఇక ఏదీ మిమ్మల్ని కదిలించలేదని ఆయన తన ట్యాగ్‌లైన్‌లో పేర్కొన్నారంటే, ఈ విజయం వెనుక కష్టం అర్థం అవుతుంది.
అంతర్జాతీయ ట్రాక్ మీద పరుగులు మొదలెట్టిన కేవలం 18 నెలలలోనే హిమాదాస్ ఈ విజయాన్ని సాధించినది. జూనియరు విభాగంలో బంగారు పతకాన్ని పొందిన ఒక సినియరు గా మరియు జూనియరు విభాగాల్లో బ౦గారు పతకంపొందిన ఏకైక భారతీయ మహిళ గా హిమదాస్ చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.
బ్రాండెడ్ షూ కూడా కొనలేని స్థిలో ఉన్న హిమాదాస్ విజయాన్ని చూసి... అడిదాస్ కంపెనీ హిమాదాస్ పేరుమీద ఒక షూ బ్రాండ్ నే ప్రారంభించింది అంటే హిమాదాస్ విజయం ఎంత గొప్పదో తెలుస్తోంది.

19 ఏళ్ల ఈ అసోం రన్నర్‌ యూరప్ లో జరిగిన అంతర్జాతీయ స్థాయి ఆటల్లో వరుస పసిడి పతకాలతో సంచలనం సృష్టిస్తోంది.. కేవలం 18 రోజుల్లో ఏకంగా ఐదు స్వర్ణాలు కొల్లగొట్టి భారత్‌ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేసి మరో పీటీ ఉషగా మన్ననలు అందుకుంటోంది.

అస్సాం రాష్ట్రం, నాగోన్‌ జిల్లా, థింగ్‌ పట్టణానికి సమీపంలో కందులిమరి గ్రామం పొలం గట్ల మీద మొదలైన హిమ దాస్ పరుగు ఫిన్లాండ్‌లోని టాంపేర్‌ స్టేడియం ట్రాక్‌ ఎక్కింది. ఈ రెండింటి మధ్య సాగిన హిమ ప్రయాణం అంత పెద్దదీ కాదు, మరీ చిన్నదీ కాదు. గోల్డ్‌ మెడల్‌ కోసం ఆమె ఆయాస పడి శ్రమించింది లేదు, ఒక ఏడాది కష్టపడిందంతే. అలాగని వడ్డించిన విస్తరిలా ఆమెకు అన్నీ సిద్ధంగా ఉన్నాయా అంటే.. ఏ ఒక్క సౌకర్యమూ లేదు. కనీసం కాళ్లకు స్పోర్ట్స్‌ షూ కొనడానికి కూడా తండ్రి దగ్గర డబ్బుల్లేవు.
హిమాదా్‌సది పేద వ్యవసాయం కుటుంబం. రన్నర్‌గా తొలి అడుగులు తన పొలంలోనే వేసింది. నాన్న వారి పండించే సాధారణ రైతు. వారి మళ్ళలోని బురదలో ఒట్టి కాళ్ళతో చిన్న చిరుత పిల్లలా హిమాదాస్ పరుగెడుతూ ఉండేది.  

స్కూల్‌ స్థాయిలో ఆమె అక్కడి మగపిల్లలతో కలిసి మొదట ఫుట్‌బాల్‌ ఆడేది.
ఆమె పరుగులో వేగం గుర్తించిన అక్కడి కోచ్ సలహా మేరకు ఆమె ట్రాక్‌,ఫీల్డ్‌లోకి అడుగు పెట్టింది.
అథ్లెటిక్స్‌ కోచ్‌ నిపన్ దాస్ చొరవతో 2017లో గువాహటి చేరిన హిమ అక్కడ తన ప్రతిభకు మరింత పదును పెట్టింది.

అనతికాలంలోనే 100, 200 మీటర్లలో మెరుపులు మెరిపించింది. అయితే 400 మీటర్లలో అయితే ఆమెకు తిరుగుండదని భావించిన కోచ్‌ నిపన్‌ దాస్‌ ఆమెను ఆ విభాగంలో మేటిగా తీర్చిదిద్దాడు.
2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల 400 మీటర్ల పరుగులో ఫైనల్‌కు చేరిన హిమ 51.32 సెక న్ల టైమింగ్‌తో ఆరో స్థానంలో నిలిచింది.

అయితే ఆ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన అథ్లెట్‌ కంటే హిమాదాస్ సమయం కేవలం 1.17 సెకన్లే తక్కువ.
తర్వాత అండర్‌-20 వరల్డ్‌ చాంపియన్‌ షిప్లో 400 మీటర్ల రేసులో స్వర్ణ పతాకాన్ని సాధించడంతో హిమాదాస్‌ పేరు ఒక్కసారిగా మార్మోగింది.

ప్రపంచ చాంపియన్‌ అయిన తర్వాతనుంచి అసోం ప్రజ లు ఆమెను ముద్దుగా ధింగ్‌ ఎక్స్‌ప్రె్‌సగా పిలుస్తున్నారు.

గత ఆసియా క్రీడల్లో 400 మీటర్ల పరుగులో 50.79 సెక న్ల జాతీయ రికార్డ్‌ టైమింగ్‌తో రజత పతకం సొంతం చేసుకుంది.
అలాగే మహిళల 400మీ. రిలేలో స్వర్ణంతోపాటు 400మీ. mixed రిలేలో కూడా స్వర్ణాన్ని ముద్దాడింది.

2018 ఏప్రిల్‌లో దోహాలో జరిగిన ఏషియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్ 400 మీటర్ల హీట్స్‌ సందర్భంగా వెన్నునొప్పితో ఆమె మధ్యలోనే వైదొలగింది.
ఆతర్వాత కోలుకున్న ఆమె ప్రస్తుతం యూర ప్‌లో పాల్గొంటున్న అంతర్జాతీయ టోర్నీల్లో పసిడి పతకాలతో హోరెత్తిస్తోంది.

అయితే హిమాదాస్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. బోర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో 400 మీ. రేసులో ఈ సీజన్‌లో తన కెరీర్ లోనే అత్యుత్తమ సమయం - 52.09 సెకన్లను నమోదుచేసింది.
కానీ వచ్చే 2019 సెప్టెంబరులో జరిగే వరల్డ్‌ చాంపియన్‌షి్‌పనకు క్వాలిఫై అవ్వాలంటే 51.80 సెకన్లలో పరుగును కంప్లీట్ చేయాలి. దీనితో 2019 లో జరిగే వరల్డ్స్ చాంపియన్ షిప్ అవకాశాన్ని మాత్రం త్రుటిలో చేజార్చుకుందిఅంతే కాదు, రాబోయే ఒలంపిక్స్ లో అర్హత సాధించాలి అంటే హిమాదాస్ ఇంకా తన పరుగును మేరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

2018 లో భారతదేశం అర్జున అవార్డుతో ఆమెని సత్కరించింది. UNICEF  భారదేశ మొట్టమొదటి యూత్ అంబాసిడర్ గా హిమా దాస్ ని అప్పాయింట్ చేసింది. అసం ప్రభుత్వ౦ రాష్ట్ర స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా హిమదాస్ ని ఏమ్పికచేసుకుంది.

ఇన్ని సాధించినా హిమాదాస్ పేరు చాలా కొద్దిమందికే తెలుసు. దీనికి కారణం మన మీడియాలో కవరేజ్ లేకపోవడం. ప్రపంచంలో  ఉన్న 200 దేశాల్లో  పట్టు మని పది దేశాలు కుడా ఆడని క్రికెట్ ని, ఓడిపోయినా పి.వి. సింధూ, కోనేరు హంపీ, సానియా మీర్జాను కవర్చేస్తూ నిత్య వార్తలుగా ప్రచ్చురించే మీడియా హిమా దాస్ విజయాలను కవర్ చేయకపోవడంతో కులాలవారీగా మీడియా వివక్ష చూపిస్తోందని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


No comments:

Post a Comment